పునర్జన్మ సిద్ధాంతం,కర్మ సిద్దాంతం
పునర్జన్మ భావాన్ని మొట్టమొదటగా ఛాందోగ్యోపనిషత్తు చెప్పింది.”కర్మల్ని బట్టి మళ్ళీమళ్ళీ పుడతారు” అని చెప్పిందీ ఉపనిషత్. ఛాందోగ్యంలో (5-10-7)లో ఇలా ఉంది:
”మంచి ఆచరణ కలవారు రమణీయమైన యోనిలో – బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య – యోనుల్లో పుడతారు.చెడ్డ ఆచరణ కలవారు నీచ యోనిలో – కుక్క, పంది, ఛండాల యోనుల్లో పుడతారు”
శరీరంలో ‘ఆత్మ’ ఒకటి ఉందనేది వైదిక సంప్రదాయ సిద్ధాంతం. దీన్నే ‘ప్రాణం’ అన్నారు. ఆయువు అంటారు. ఈ ‘ఆత్మ’ జీవుని దేహంలో చేరుతుంది ఒక సూక్ష్మ జీవి శరీరంలోకి ప్రవేశించినట్లు.ఆత్మ తన కర్మల్ని అనుభవిస్తూ జీవిస్తుంది. ఇది దేహాన్ని ఒక ‘ఉపాధిగా’ లేదా ఒక ఉపకరణంలా మాత్రమే వాడుకుంటుంది. భగవద్గీత ప్రకారం ఒక చొక్కాలా లేదా ఒక ప్యాంటులా కాదంటే ఒక పంచెలా, లేదా చీరలా. మనం ధరించిన చొక్కా చినిగిపోగానే దాన్ని వదిలి, మరలా మనం ఎలా కొత్తచొక్కా తొడుక్కుంటామో- ఆత్మ దేహాన్ని కూడా అలాగే మార్చేస్తుంది. ఈ శరీరం శిధిలం కాగానే మరోకొత్త శరీరంలోకి పోతుంది.
ఆ ఆత్మ తను బ్రతికిన కాలంలో చేసిన ‘కర్మ’ ఫలాల్ని మోసుకుంటూ పోయి మరోజన్మ ఎత్తుతుంది. ఈ కర్మల్నే ‘సంచిత’ కర్మఫలాలు అంటాం. అంటే సంచిలో వేసుకుని మరోజన్మకు మోసుకుపోయే కర్మఫలాలు అన్నమాట. ఆ మరో జన్మనే ”పునర్జన్మ” అంటాం. ”పునః” అంటే మాటిమాటికి అని. పునర్జన్మ అంటే మాటిమాటికి పుట్టడం.దీనినే పునరపి జననం,పునరపి మరణం అన్నారు.
ఆత్మ నిత్య సత్యమైనది, చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానం ఆత్మ జ్ఞానమే.అంటే తనను తాను తెలుసుకోవడమే. తనలోని అంతరాత్మ గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాలలో (పరమాత్మను)భగవంతుని చేరవచ్చు.
“నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్
కార్యతేహ్యవశః కర్మ సర్వప్రకృతిజైర్గుణైః ” —
(గీత 3అ.5శ్లో.)
సృష్టిలోని ప్రతిప్రాణీ ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండలేదు. మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం. మనస్సు,వాక్కు,శరీరం అనే మూడు త్రికరణాల ద్వారామనం అనుక్షణం ఏదో ఒక
పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2రకాలు.1బైటికి కనిపించేవి.2.కనిపించనివి. వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ 2రకాలు.పుణ్యకర్మలు. పాపకర్మలు. పుణ్యకర్మలవల్లసుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావంసూక్ష్మ శరీరం గా (మనోబుధ్ధిచిత్యహంకారములు)
ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.
బాల్యం లోజరిగిన వాటిని ముసలితనం లో చెప్పడంకొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటివన్నీ ఈ వాసనలే.
కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునికి ధారపోయాలి.
భగవంతునికి శరణాగతుడైనవాడికి ఈ జన్మ జన్మల పరంపరా బంధంనుండి విముక్తి లభిస్తుంది.దీన్నే మోక్షం అన్నారు.
జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పుణ్య కర్మలతో సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడూ పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండడు కదా అనే ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలు న్నాయన్న దాన్ని తెలుపుతుంది.
పురాణేతిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లని చెపుతాడు. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చు.
ప్రతి మనిషి ఏడు సార్లు ఇలా పునర్జిన్మంచడానికి అవకాశం ఉంటుందన్నారు.
శారీరకంగా మగవాళ్లు, ఆడవాళ్లు మాదిరిగానే ఏడు సార్లు జన్మిస్తారు. అయితే వాళ్లు చేసిన మంచి, చెడు పనులను బట్టి.. వాళ్ల తర్వాత జన్మ ఆధారపడి ఉంటుంది.మోక్షంతో జన్మలు ఆగి పోతాయి.
పునర్జన్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతానికి దారితీసింది.పేదలు పేదరికంలో మగ్గడానికి కారణం పాప పుణ్యాలతో ముడి పెట్టి చెప్పారు.గత జన్మలో పాపం చేయడం వల్లనే ప్రస్తుత జన్మలో బీదరికం అనుభవిస్తురని ఈ సిద్ధాంతం చెబుతుంది.ధనవంతుల సుఖాలకు ఇదే కారణం చెప్పింది ఈ వేదాంతం (ఉపనిషత్ సారం).దీన్నే భగవద్గీత లో కృష్ణుని ద్వారా చెప్పించి ఈ సిద్ధాంతాన్ని ప్రజల్లో విపరీతంగా ప్రచారం చేశారు.
పునర్జన్మ సిద్ధాంతం,కర్మ సిద్దాంతం భావాలు వేద కాలంలో లేవు.కానీ ఇవి ఉపనిషత్తుల కాలంలో ఎలా ఏర్పడ్డాయి?
Comments
Post a Comment