మనుస్మృతే ఆనాటి రాజ్యాంగం
హిందూ ధర్మ శాస్త్ర గ్రంధం క్రి.పూ. 125-100 కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తారు. సంస్క్రతంలో ఉన్న ఈ గ్రంధాన్ని 1794 లో సర్ విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించారు.
భారదేశం వర్ణవ్యవస్ధ కలిగిన దేశం. ఇటువంటి వర్ణవ్యవస్ధ అఖండ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. భారతసమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సమాజంగా మనుస్మృతి విభజించింది. ఈ వ్యవస్ధ శూద్రులకు విద్య, ధనసంపాదన నిషేదించింది. “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272).
“అగ్రవర్ణలతో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులు కోసివేయాలి లేదా ఇనుపకర్రలతో కాల్చాలి” (మనుస్మృతి 8-281)
“శూద్రుడు ఆస్తి సంపాదించరాదు” (మనుస్మృతి 10-29).
“హీన జాతి పురుషుడు ఉన్నత స్త్రీని తనను వలచినదాననైనను మొహమున పొందునో వానికి ‘లింగచ్చేదము, వధయను’ దండమునకు అర్హుడు” (మనుస్మృతి 8-366).
శూద్రులంటే నేటి వెనుకాడిన కులాలు. వీరిని కాలక్రమంలో మహాశూద్రులుగా (బాగా వెనుకబడిన వాళు) అతి శుద్రులుగా (అంటరాని వాళ్ళు) తిరిగి విభజించారు. ఈ మధ్యకాలంలో బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఆక్రమించుకుని పరిపాలించారు. అందరూ చదువుకోవడంలో కొన్ని నిర్భంధాలు కొద్దిగా సడలాయి.
14 ఏప్రిల్ 1891న జన్మించిన అంబేద్కర్ అతి శూద్రులలో జన్మించాడు. బాల్యం గడిచేసరికి అతడికి చదువు విలువ తెలిసివచ్చింది. సంఘసంస్కర్తల దయాధర్మాల మీద ఆధారపడి విద్య కొనసాగించాడు. అవమానాలను, ఆకలిని భరించాడు. అణగారిన వర్గాల తరపున సాంఘిక విప్లవబావుటాను ఎగరవేశాడు. 25 డిసెంబర్ 1927న మహాద్ అనే చోట మనుస్మృతిని తగులబెట్టి తిరుగుబాటు శంఖాన్ని పూరించాడు. సమాజంలో అతి దయనీయ నికృష్ట జీవితాలు గడుపుతున్న జనులను సమీకరించి ఒక సామాజిక విప్లవాన్ని నిర్మించాడు.
ఒకవైపు సామజిక చైతన్యం ప్రజల్లో నింపడానికి కృషి చేస్తూనే ప్రపంచ సమాజాలను రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. మనదేశం స్వాతంత్ర్యం సాధించిన తర్వాత రాజ్యాంగ పరిషత్ అద్యక్షునిగా భారత రాజ్యాంగాన్ని రూపొందించిన శిల్ప అంబేద్కర్. అంబేద్కర్ ఒక గొప్ప దార్శనికుడు. ఆసేతు హిమాచలం వరకు విభిన్న భాషలు, సంస్మృతులు, మతాలు కులాలు తెగలు గల మన దేశానికి ఒక సర్వసత్తాక, గణతంత్ర, లౌకిక రాజ్యాంగాన్ని రాజ్యాంగకర్తగా ప్రసాదించాడు తర్వాత దీనికి సామ్యవాదం (socialism) 1976లో జోడించబడింది. సకల దేశ వాసులకు సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించిన ధీరుడతడు. అయన మాటల్లోనే “భారతదేశం వైరుధ్యాల మధ్య మనుగడ కొనసాగించ బోతున్నది. ఒకవైపు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ,సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రసాదిస్తే, సాంఘికంగా మతం వాటిని తోసిపుచ్చుతుంది.“
ఏ ఆశయాలతో అయిన మనదేశానికి రాజ్యాంగాన్ని తయారుచేశాడో ఆ ఆశయం యింకా నెరవేరలేదు. అయన మరో మాట కూడా చెప్పాడు. “ఒక దేశ అభివృద్ధిని తూకం వేయాలంటే ఆ దేశంలో స్త్రీకి ఎంత స్వేచ్చ అభిస్తుందో గమనించాలి”
ఒకసారి మనం దేశ పరిస్ధితులను అవలోకిస్తే మనం ఎటు ప్రయాణం చేస్తున్నామో అర్ధమవుతుంది. అంబేద్కర్ ఆశయాలను సాకారం చేయగలిగిన సామర్ధ్యాలను యువతరం పుణికి పుచ్చుకొని దేశాన్ని ప్రగతిపధంలోకి నడిపిస్తారని ఆశిద్దాం.
_పైడిముక్కల ఆనంద్ కుమార్.
సెల్: 9490300459
Comments
Post a Comment