క్రైస్తవమత తాత్విక చింతనా ధోరణులు
ఆధునికభారత సమాజ నిర్మాణం లో క్రైస్తవం ప్రముఖ పాత్ర పోషించింది. పురాతన కాలం లో భారతీయ సమాజం ప్రపంచం లోని అతి కొద్ది నాగరికతల్లో ఒకటిగా వికసించినా తర్వాతికాలంలో పూర్తి వెనకపట్టు పట్టింది. మూఢ నమ్మకాల్లో, పురుషాధిక్యత తో కునారిల్లింది. ముఖ్యంగా ముస్లిం దండయాత్రలతో ముస్లిం రాజుల పాలనలోకి వెళ్లాక వారు ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలలో జోక్యం చేసుకోక పోవడం వల్ల ఆనాటి భారతీయ సమాజంలో పెనుమార్పులు రాలేదు.కాక పోతే వారి ప్రభావం వల్ల రకరకాల దేవుళ్ళ స్థానం లో ఏకేశ్వరోపాసన మొదలైంది.చిల్లర రాళ్ళకు మొక్కడం కన్నా చిత్తంలో శివుని మొక్కడం మేల్కొన్న అభిప్రాయం పెరిగింది.
ఆ తర్వాత బ్రిటిష్ వారు మన దేశం లోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్ళతో వచ్చిన క్రైస్తవం సమాజం పై సానుకూల ప్రభావం చూపించింది.
ఆంగ్లేయులు భారతీయ సమాజంలో ఉన్న అనేక సామాజిక దురాచారాలను తొలగించడానికి ప్రయత్నం చేశారు.బ్రిటిష్ పాలకులు కొందరు తటస్థ వైఖరిని ప్రోత్సహించగా, మరికొందరు క్రైస్తవ మత ప్రచారాన్ని కాదనలేదు. కనుక మత ప్రచారకులు 1705 నుండీ తమ కార్యకలాపాలు పరిమితంగా సాగించారు. భారతదేశంలో మత ప్రచారాన్ని ప్రభుత్వపరంగా చేయాలనే ప్రయత్నాన్ని 1793లోనే బ్రిటిష్ పార్లమెంట్ నిరాకరించింది. 1813 నాటికి దేశంలో క్రైస్తవ మత ప్రచారకులకు అధికారిక స్థానం కల్పిస్తూ బ్రిటిష్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. అమానుషమైన హిందూ ఆచారాలు కొన్ని తొలగించాలని మిషనరీలు ప్రయత్నించాయి. సతీ సహగమనం, అంటరానితనం మొదలైనవి ఇందులో ఉన్నాయి. లార్డ్ విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్ గా సతీ సహగమనాన్ని నిషేధించడానికి భారతీయుల మద్దతు, సహకారం కోరాడు.దాంతోరాజా రామ మోహన రాయ్ లాంటి సంఘ సంస్కర్తలు ఆంగ్లవిద్య చదవడంతో హిందూ మతం లో ఉన్న దురాచారాలను అర్థం చేసుకున్నారు.దాంతో సతీ సహగమనం లాంటి సాంఘిక దురాచారాల పై పోరాడారు.ఆధునిక విద్య కోసం ఆరాట పడినారు. అందరికీ విద్య కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . స్త్రీ సమానత్వం కోసం తర్వాత ఎంతోమంది సంఘ సంస్కర్తలు పాటుబడినారు. వీటన్నింటిపై క్రైస్తవ మిషనరీల ప్రభావం అపారంగా వుంది.
ఈశాన్య భారతం లో ఆదివాసీలు ఆధునిక నాగరికతకు అలవాటు పడటం లో క్రైస్తవ మిషనరీల పాత్ర ను ఎవరూ విస్మరించలేరు. నాగాలాండ్ లో వున్న తెగలు ఒకరి తల ఇంకొకరు నరుక్కునే ఆచారం అనాదిగా వుంది. ఎన్ని తలలు అవతలి తెగ వాళ్ళవి సేకరిస్తే అంత ఘనత. ఆ సంస్కృతి ని మార్చి తెగల మధ్య సఖ్యతను తీసుకురావటం లో నాగా చర్చి గణనీయమైన పాత్ర పోషించింది. అలాగే మిజోరాం సమాజ అభివృద్ధి లో కూడా. ఈ రోజు మిజో రాష్ట్రం సాంఘిక ప్రామాణికాల్లో దేశ సగటు కన్నా చాలా ముందుండటానికి చర్చి పాత్ర ఎంతో వుంది. క్రైస్తవ మత వ్యాప్తి లో అక్షరాస్యత భాగంగా వుంది. కేరళ దేశం మొత్తం మీద అక్షరాస్యత లో ముందుంటే కేరళ లో మిగతా మతస్తుల కన్నా క్రైస్తవులు అత్యధిక అక్షరాస్యత కలిగివున్నారు.అలాగే కుటుంబ నియంత్రణ పాటించటం లో క్రైస్తవ సమాజం భారత్ లో ముందుంది. మిగతా మతస్తులతో పోలిస్తే జనాభా వృద్ధి రేటు క్రైస్తవుల్లో తక్కువుంది.
భారత రాజ్యాంగం ప్రకారం మతస్వేచ్ఛ అందరికీ వుంది. మతాన్ని యధేచ్ఛగా అనుసరించవచ్చు, ఆచరించవచ్చు,ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వం యీ విషయంలో కేవలం ప్రజారోగ్యం, విద్య, మౌలిక వసతులు, శాంతిభద్రతలు వంటి వాటిలో జోక్యం చేసుకోవచ్చు. ఆయా మత సంస్థలు తమ సంస్థల్ని కొనసాగించవచ్చు. ఆస్తుల్ని సంక్రమింపజేసుకోవచ్చు. చట్టానికి లోబడి తమ సంస్థల, ఆస్తుల పాలన సాగించడానికి రాజ్యాంగ రీత్యా మతపరమైన హక్కులు అందరికీ ఉన్నాయి.
కేరళలో క్రైస్తవ విద్యాసంస్థలకు ప్రభుత్వ నిధులు భారీగా అందుతుండేవి. 1957లో సంబూద్రిపాద్ ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడి, క్రైస్తవుల మతాధికారాల్ని తగ్గించే చట్టం తెచ్చారు. దీని ప్రకారం కొన్ని పరిస్థితులలో మత విద్యాసంస్థల యాజమాన్యాన్ని అవసర మనుకుంటే ప్రభుత్వం చేబట్టవచ్చు. సుప్రీంకోర్టు యిందుకు అభ్యంతరపెట్టింది. అయితే ఫీజుల వసూళ్ళు, ఉపాధ్యాయుల నియామకం, జీతాల చెల్లింపులో క్రమబద్ధత పాటించేటట్లు ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కేరళలో క్రైస్తవులు కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన తీవ్రతరం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కేరళలో క్రైస్తవుల ప్రవర్తన, దీనికి కాంగ్రెసు వారిచ్చిన మద్దతు వలన, సెక్యులరిజం అర్థం మారిపోయింది. మతం విజృభించి తన పరిధిని విస్తరించింది.
లోక్ సభలో తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు సభ్యుడుగా బిల్లు ప్రవేశపెడుతూ రాజకీయల్లోకి మతం చొచ్చుక రావడాన్ని ఆపాలన్నారు. కేథలిక్ చర్చిని రాజకీయ ప్రయోజనాలకు వాడడాన్ని ఆపాలని బిల్లు ఉద్దేశించి డిమాండ్ చేశారు.
లోక్ సభలో మరో కమ్యూనిస్టు సభ్యుడు ఎస్.వి.పరులేకర్ ప్రవేశపెట్టిన తీర్మానం కూడా ఆమోదించలేదు. ప్రార్థనా ప్రదేశాలు, యాత్రాస్థలాలు రాజకీయ ప్రచారానికి వినియోగించరాదని యిందులోని సారాంశం. 1961 ఫిబ్రవరిలో వచ్చిన యీ అనధికార తీర్మానాన్ని సభ తిరస్కరించింది. ఈ విధంగా సెక్యులర్ వ్యతిరేక ధోరణులు చట్టసభలలో అధికారపక్షం ప్రదర్శిస్తూనే వచ్చింది.
భారతదేశంలో ప్రపంచసాహిత్యం, మానవ విలువలు, వ్యక్తి స్వేచ్ఛ వ్యాపించడానికి క్రైస్తవ మిషనీరీలు అందిస్తున్న విద్య చాలావరకూ ఉపకరించిందన్నది కాదనలేని సత్యం. కాని దేశంలో ఉన్న అన్ని మతపరమైన వ్యవస్థలు, కులాలు, ప్రచారాలు, మతోన్మాదం లౌకిక వాదానికి అడ్డుగా నిలుస్తున్నాయి.
___పిళ్లా కుమారస్వామి, 9490122229





Comments
Post a Comment