Skip to main content

సామాజిక తత్త్వవేత్త శ్రీ నారాయణ గురు.




      భారతదేశపు చీకటి రాజ్యం లో   సామాన్యుల కుత్తుకల మీద విలయతాండవం చేసిన సామాజిక వ్యవస్థ కులం.  హిందూమతం లో అశాస్త్రీయ భావాలతో సాగిన
సతీ సహగమనం, బాల్య వివాహం, కులవ్యవస్థ, మూర్ఖత్వంగా సాగుతున్న  మూఢ విశ్వాసాలను   చాలా మంది తాత్విక వేత్తలు ప్రతిఘటించారు.“స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం, సమానత్వం” వంటి విప్లవాత్మక ఆధునిక భావాలపట్ల ఆకర్షితులై భారత దేశం లో ని సమస్యలన్నిటినీ రూపుమాపడానికి నిస్వార్థం గా అమూల్యమైన సేవ కూడా చేసారు వీరు. ఇలాంటి  నిశ్శబ్ద భారతీయ సామాజిక తాత్విక వేత్త లలో శ్రీ నారాయణ గురు ఒకరు.

 నారాయణగురు క్రీ.శ. 1854 ఆగస్టు 20న కేరళలో తిరువనంతపురానికి కూతవేటు దూరంలో 'చెంపాజండీ' గ్రామంలో ఈళవ అనే హరిజన కులంలో మదన్ ఆశాన్, కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. అందరూ ఆయనను 'నానూ' అని పిలిచేవారు. చట్టాంబీ స్వామి అనబడే కుంజన్ పిల్లె వద్ద సంస్కృత అధ్యయనం చేశాడు. తిక్కాడ్ అయ్యబూ వద్ద యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. నారాయణగురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలాకాలం తపస్సు చేశాడు. ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందనే జీవన రహస్యాన్ని తెలుసుకున్నాడు. అక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు.
నారాయణను వారు ప్రేమగా 'నానూ' అని పిలుచుకునేవారు. ఐదవ ఏట ఆయన తన విద్యాభ్యాసాన్ని పాత 'గురుకుల' పద్ధతిలో పొరుగునే ఉన్న పాఠశాలలో ప్రారంభించారు. మాదన్ ఆశన్‌ కూడా ఉపాధ్యాయుడే. ఆయనకు జ్యోతిశ్శాస్త్రంలోనూ, ఆయుర్వేదంలోనూ మంచి ప్రవేశం ఉంది. నారాయణగురు చిన్నతనంలోనే సంస్కృతాన్ని అభ్యసించారు. తల్లిదండ్రుల దగ్గర, గురువుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆయుర్వేద విద్యను కూడా ఆయన చిన్నతనంలోనే నేర్చుకున్నారు.
ప్రఖ్యాత సంస్కృతవిద్వాంసుడు రామన్ పిళ్ళై ఆశాన్ వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. మేనమామ కూతురే అయిన తన భార్యను అర్ధాంతరం గా వదిలేసి చెప్పాపెట్టకుండా దేశాటను వెళ్ళిన నారాయణ దక్షిణా భారత దేశం అంతా తిరిగాడు. పేదరికం తో సహజీవనం చేసాడు. స్వయం గా అవర్ణుడై ఉండటం చేత జనం సమస్యలను అతి దగ్గర గా గమనించాడు. సంఘం లో ని దురాచారాలను దగ్గరి గా గమనించి ఏం చెయ్యాలో నిశ్చయించుకున్నాడు.

       అంటరానితనం, స్వార్థపరులైన ఒక వర్గపు ప్రజలు కోట్ల మంది ప్రజలపై సాగిస్తున్న పెత్తనం, లెక్కలేనన్ని కులాలు, కులాల్లో మళ్ళీ ఉపకులాలు, ఉప కులాల్లో తెగలు, తెగల్లో వైషమ్యాలు, తలాతోకా లేని నమ్మకాలు… పంచములకు ఆలయ ప్రవేశం లేదు! ఇవీ ఆ కాలపు కేరళ పరిస్థితులు. 
           అరువిప్పురం అనే గ్రామం లో 1888 లో, వారికోసం ఉదయం వేళ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠాపించాడు.ఒక పంచముడు – విగ్రహ ప్రతిష్ఠాపన చేయడాన్ని సహించ లేని బ్రాహ్మణులు  ” అవర్ణుడివి, అందునా ఈళవ కులస్థుడివి, నీకు విగ్రహ ప్రతిష్ఠాపన చేసే హక్కు ఎవడిచ్చాడు?” అని అడిగారు. అందుకు నారాయణ గురు “క్షమించాలి. ఈ విగ్రహం బ్రాహ్మణ శివునిది కాదు. ఈళవ శివునిది.” అన్నాడు. ఒక్కదెబ్బతో దురహంకారుల గుండెలు చీల్చాడు నారాయణ గురు.  అంతే వారు నోరు మూసుకున్నారు.

         చదువు  స్వేఛ్చ, సమానత్వాలను సాధించడానికి నిచ్చెనలా ఉపయోగపడుతుందని భావించిన  నారాయణ గురు, విద్య అనే ఆయుధం ద్వారా లక్షలాది మంది అణగారిన ప్రజలను విముక్తుల్ని చేశారు. విద్యతోనే దళితులకు, స్త్రీలకు ఆత్మగౌరవం వస్తుందని ప్రబోధించాడు. 
        కేరళ సమాజంలోని మూఢ విశ్వాసాలను, కుల తత్వాన్ని నిరసించాడు. కులం కారణంగా కొన్ని వర్గాలకు చెందిన ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ, సామాజిక స్వాతంత్ర్యం ఉండాలని ఆయన భావించాడు. వారిని ఉద్ధరించడానికి ఆలయాలు, పాఠశాలలు మొదలైన సంస్థలు నెలకొల్పడానికి పాటు పడ్డాడు. 
        
       ఆరోజుల్లో సమాజం ఉన్నత కులం, తక్కువ కులాలుగా విభజితమై ఉంది. సమాజం పూర్తిగా కుల వ్యవస్థ గుప్పిట్లో ఉంది. ప్రజలు అస్పృశ్యతను పాటించేవారు. పరస్పరం సహకారం అందించుకునేవారు కాదు. నారాయణగురు ఉద్యమంలో ప్రధానమైంది అణగారిన ప్రజలకు విద్య. ఆయన గుడుల్లో బడులు నిర్వహించారు. మానవులందరూ సమానమని పేర్కొన్నారు. ఆయన ప్రతి మనిషి చదువుకోవాలని, దేవుడు వేరే లేడని, మనలోనే ఉన్నాడని సందేశమిచ్చాడు.                     స్పష్టమైన అవగాహనతో దళితులు, స్త్రీల విముక్తి కోసం ఆయన ఉద్యమించాడు.  ఏ విద్య అయినా ఏ కులానికైనా వస్తుందనేది ఆయన ప్రధాన ఉద్దేశం. ఆయన కుల, మత భేదాలను నిరసించారు. జ్ఞానం అనేది స్వయం సంపార్జితం అని చెప్పారు. బుద్ధుని సూత్రాలు ఎన్నో ఆయన బోధనలో వ్యక్తమవుతాయి. 
        భక్తి కవుల మార్గాన్ని ఆయన తీసుకున్నారు.ఆయన గుడిలో కేవలం దేవుణ్ణి పూజించటమేకాక గుడిని  విద్యాలయంగా మార్చారు.   ఆ రోజుల్లో కేరళలో నంబూద్రిపాదులు, బ్రాహ్మణులు తీవ్రమైన వర్ణ, కుల వ్యవస్థలను పాటిస్తున్నారు. అస్పృశ్యతను పాటిస్తున్నారు. నంబూద్రిపాదులు కరుడుగట్టిన వర్ణతత్వ వాదులు.            నారాయణగురు తాత్విక దృక్పథం మనకు భక్తికవులను తలపిస్తుంది.       భారతదేశంలో భక్తికవుల ఉద్యమం హిందూ సామ్రాజ్యవాదుల మీద తిరుగుబాటు చేసింది. ఆ తరువాత నారాయణగురు భక్తికవుల మార్గంలో విద్యా వికాస ఉద్యమం నడిపారు.  కులం పునాదుల మీద ఆయన దెబ్బకొట్టారు. నిశ్శబ్ద విప్లవం ఆయనది. బడుగుల మెదళ్ళలో అక్షర జ్యోతులు వెలిగించారు. నారాయణగురు అస్పృశ్యతా నివారణ కోసం ఎంతో కృషి చేశారు. నారాయణగురు బడుగు ప్రజల్లో నైతిక ప్రవర్తన గూర్చి బోధించారు. తాగుడు, జూదం, స్త్రీ వ్యామోహానికి దూరంగా ప్రజలు జీవించే ప్రయత్నం చేశారు. ఆయన శుభ్రతను బోధించారు. 
        నారాయణగురు  ఆచరణాత్మక ఉద్యమం నడిపాడు. మనిషిలోని కుల కల్మషాన్ని కడిగివేసి, అస్పృశ్యతా కళంకాన్ని తుడిచివేసి, మనిషిని సంస్కారవంతుణ్ణి చేసి, మనిషిని బుద్ధ జీవిని చేసి, మనిషిని సామాజిక, సాంస్కృతిక విప్లవ కారుడిగా మలిచడానికి కృషి చేశాడు.  
      నారాయణ గురు తన సామాజిక ఉద్యమానికి దేవాలయాలను వేదికగా చేసుకున్నారు.దేవాలయాలు స్వచ్ఛతకు ప్రగతి కేంద్రాలుగా ఉండాలని, వాటికి అనుబంధంగా తోటలు, గ్రంధాలయాలు, ఉపన్యాస మందిరాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలు నారాయణ గురు స్థాపించారు.  అలాగే అవి వెనుకబడిన తరగతుల వారి ఆధ్యాత్మిక, సాంఘిక, ఆర్థిక ప్రగతికి గొప్ప సాధనాలుగా ఉపయోగపడ్డాయి.
      

దేవునిముందు అందరూ సమానులే. ఉచ్ఛనీచ భావాలకు ఆయన అతీతుడు నారాయణగురు ప్రజలకు సందేశాన్నిచ్చాడు. నారాయణ గురు అనేకచోట్ల గుడులు కట్టించి అక్కడ హరిజనులకు ప్రవేశాన్ని కల్పించాడు. ప్రజలలో మూఢ నమ్మకాలను తొలగించడానికి ఉద్యమించాడు. ఆయన పశుహింసను సహించలేకపోయేవాడు. జంతుబలిని ఆపించడంలో ఆయన విజయం సాధించాడు. ప్రజలకు పారిశుద్ధ్య ప్రాముఖ్యతను ప్రచారం చేశాడు.

మతం కోసం మనిషి కాదు మనిషి కోసమే మతం అని, కుల వివక్షను అంటరానితనాన్ని అర్థంలేని మూఢాచారాలను నిర్మూలించాలని నారాయణ గురు గుడిని ఆరాధన స్థలంగా కాక విద్యావ్యాప్తికి కేంద్రబిందువుగా తీర్చిదిద్దాడు. 
పురుషులతో సమానంగా స్త్రీలు కూడా తప్పనిసరిగా విద్యావంతులు కావాలన్నాడు. విద్యా విషయంలో స్త్రీలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేసేందుకు వీలు లేదన్నాడు. ప్రతి చోటా సొంతంగా ఒక సాహితీ సంఘాన్ని గ్రంథాలయాన్ని రీడింగ్ రూం ఏర్పాటు చేశాడు నారాయణ గురు మూఢనమ్మకాలని మద్యపానాన్ని ఆర్థికంగా కుంగదీసే అర్థంలేని ఆచారాలను సంప్రదాయాలను నిరసించారు.మనుషులంతా ఒక్కటే మనమంతా ఒక్కటే అని నినదించిన సంఘసంస్కర్త నారాయణ గురు.

వారసత్వంగా వచ్చే వృత్తులను బట్టి మనుషులను విభజించే విధానాన్ని నారాయణ గురు వ్యతిరేకించారు. నలభై సంవత్సరాల వ్యవధిలో నారాయణగురు సామాజిక మహాద్భుతాన్ని సాధించారు. విద్యతోనే అణగారిన వర్గాలలో అభ్యున్నతి ఉంటుందని చెప్పడమే కాకుండా ఆచరణలో చేసిచూపారు. నారాయణ గురు సెప్టెంబరు 20, 1928లో అంతిమశ్వాస వదిలారు. 

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం