మనసే అన్నింటికీ మూలమన్న శారద దేవి
శారదా మాత తరచూ, మనసు చేసే మాయ గురించి మాట్లాడేవారు. ‘మనసే అన్నింటికీ మూలం. దర్శించే ప్రతి విషయాన్నీ ఇది మంచి, ఇది చెడు అంటూ బేరీజు వేసేది మనసే. అందుకని ఎదుటివారిలో తప్పులనే వెతకాలనుకుంటే ముందు నీ మనసే దోషపూరితం అయిపోతుంది,’ అని ఒక సందర్భంలో అంటారు. అంతేకాదు శారదామాత చివరి సందేశం కూడా ఇంచుమించు ఇలాగే సాగింది- ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. అందుకు బదులుగా మీ లోపాలేమిటో గ్రహించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా దానిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ ప్రపంచమే మీది అనుకున్నప్పుడు... అంతా మనవారే అన్న భావన కలుగుతుంది.’ ఏమైనా అమ్మ అమ్మే! అందుకే ప్రపంచంలోని వారంతా తన బిడ్డలేననీ, వాళ్లంతా ఒకరిలో ఒకరు తప్పులు వెతుక్కుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉండాలనీ కోరుకుంది. అందుకే శారదాదేవి కాస్తా శారదామాతగా భక్తుల గుండెల్లో నిలిచిపోయింది. రామకృష్ణులు ఆమెను కాళికకు ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది! తనలోని మాతృభావనను ఈ ప్రపంచం మొత్తానికీ విస్తరించాలనుకునే ప్రతి తల్లీ కాళికామాతే కదా!
Comments
Post a Comment